భారత ప్రజలమైన మేం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమాలను గమనిస్తే మన రాజ్యాంగ పీఠికలోని "భారతీయులమైన మేం" అనే మాటలకు కనీసం రెండు రకాల భావనలకు అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా ఈ మాటలు నైరూప్యమైనవి. ఇవి ఒక వ్యక్తో, సామాజిక బృందాలో చెప్తున్న మాటలుగా కనిపించవు. 1950 జనవరి 26న ప్రతిధ్వనించిన ఈ మాటలు ఊహాత్మకమైనవి. ఈ రాజ్యాంగాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు అని తెలియజేయడానికి ఉద్దేశించినవి. ప్రతి సామాజిక బృంద ప్రతినిధి వీటిని ఆమోదించినట్టుగా భావించాం.
ఇక్కడ "మేం" అన్న ఈ మాట భారత్ కు చెందిన వారు అన్న అర్థంలో వాడిందే. రాజ్యాంగాన్ని అమలులోకి తెస్తున్న సందర్భంలో ఇలా చెప్పాం. మరో వేపున "మేం" అనే ఈ మాట ప్రజలందరికీ సంబంధించింది. అందులో మతం, ప్రాంతం, కులం, స్త్రీలా పురుషులా అన్న దానితో సంబంధం లేదు. వీరందరూ భారతీయులు అన్న అర్థంలోనే వాడాం. అయితే చారిత్రకంగా చూస్తే రాజ్యాంగం సిద్ధం చేస్తున్న సమయంలో భిన్నాభిప్రాయాలు వినిపించిన మాటా వాస్తవమే. అయినప్పటికీ ఈ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారి నాయకులు రాజ్యాంగ పీఠికలో ఉద్దేశించిన అర్థాన్ని ఆమోదించినట్టే. ఈ మాటలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రతీక. సిద్ధాంతపరంగా సార్వభౌమాధికారం, సెక్యులర్, సోషలిస్టు, ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉంటామని అర్థం. "మేం" అన్న మాట ఈ సూత్రాలను అందరూ అంగీకరించినట్టు లెక్క. అంటే "భారత ప్రజలమైన మేం" అన్న మాట ఏకాభిప్రాయంతో చెప్పిందే.
రాజ్యాంగ నిర్మాతలు 1950లో ఈ మాటను ఆమోదించినప్పుడు, దాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చినప్పుడు ఈ మాటకు నిర్దిష్టమైన అర్థం ఇది అని చెప్పినట్టు కనిపించదు. పౌరులు అన్న ఉమ్మడి గుర్తింపు ఆధారంగానే ఈ మాటను అర్థం చేసుకున్నాం. రాజ్యాంగ పీఠికలో ఉన్న "పౌరులు" అన్న మాట సాంకేతికమైందే. దానికి రాజ్యాంగంలో నిర్దిష్ట స్థానం ఉంది.
రాజ్యాంగంలో నిర్దేశించిన పరిమితులకు లోబడి పౌరులకు హక్కులు ఉంటాయని అనుకున్నారు. అందువల్ల "భారతీయులమైన మేం" అనే మాటకు పౌరసత్వం అన్న విస్తృతమైన అర్థం ఉంది. అందుకే "భారత ప్రజలమైన మేం" అన్న మాట తరవాతే పౌరులు అన్న మాట కనిపిస్తుంది. లోతైన భావం ఉన్న ఈ మాట సమానత్వానికి సంబంధించింది కనక ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలలో భాగం అయింది. అందుకే ఇది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం అనుకోకూడదు. అది ప్రజల అనుభవ సారం అన్న దృష్టితోనే ఈ మాట వాడారని గుర్తుంచుకోవాలి. ఈ వాస్తవ అనుభవం ఒక రకంగా విషాదాత్మకమైంది కావచ్చు. ఎందుకంటే దళితులను దోపిడీ చేయడం, మహిళలను అణచివేయడం, ఆదివాసీలను విడిగా చూడడంలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి. మరో పార్శ్వం నుంచి చూస్తే ప్రజల జీవితానుభవం సాంస్కృతిక రంగంలో వైవిధ్యానికి నిదర్శనం కూడా. అణగారిన వర్గాల వారికి, విశేష అధికారాలున్న వారికి సామాజిక అశాంతి నుంచి భద్రత కల్పించడంలో సమానత్వం పాటిస్తామని రాజ్యాంగం హామీ ఇచ్చినట్టైంది.
"భారతీయులమైన మేం" అన్న మాట ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కూడా ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. ఈ నిరసనలు రాజ్యాంగానికి మూలకందమైన సూత్రాలకు ఉన్న అసలు అర్థాన్ని గుర్తు చేయడమే కాదు, ఆ అసలైన అర్థాన్ని పునరుద్ఘాటించడం కూడా. ఈ నిరసనలు ఆ అసలు అర్థాన్ని పునరుద్ధరించడానికే. రాజ్యాంగ రూపకర్తలను గుర్తు చేసుకోవడంలో, రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడంలో పరమార్థం ఇదే. అందుకే "భారతీయులమైన మేం" అన్న మాట ప్రజలనుంచి మరో సారి వినిపిస్తోంది. "మేం" అన్న మాట రాజ్యాంగానికి బద్ధులమై ఉంటామన్న సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తోంది. "అధి సార్వభౌములు" అన్న భావనకు లొంగేది లేదని స్పష్టంగా ప్రకటిస్తున్నారు.