ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు పునరుద్ధరణే జరిగితే!
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
దేశ ఆర్థిక వ్యవస్థ చట్రాన్ని పటిష్ఠం చేయాలన్న ప్రధాన ఎజెండాతో 2019 నవంబర్ 7వ తేదీన జరిగిన ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి మండలి (ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్) సమావేశాన్ని బట్టి చూస్తే ప్రస్తుత ప్రభుత్వం 2017నాటి ఆర్థిక పరిష్కారం, డిపాజిట్లకు బీమా (ఫైనాషియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ - ఎఫ్.ఆర్.డి.ఐ.) బిల్లును పునరుద్ధిస్తుందేమో అన్న అనుమానం కలుగుతోంది. ఈ బిల్లును 2017లో ప్రవేశపెట్టిన ఏడాదిలోగా ఇదే ప్రభుత్వం ఈ బిల్లును రద్దు చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ బిల్లును రద్దు చేయడానికి ప్రధాన కారణం ఇందులో ఆర్థికంగా "గట్టెక్కించడం" అన్న నిబంధన ఉండడమే. ఈ నిబంధన కారణంగా ఆర్థిక సంస్థల్లో మదుపు పెట్టిన ఖాతా దార్లు ఆ ఆర్థిక సంస్థ గనక విఫలమైతే మదుపు పెట్టిన వారు కొంత నష్టపోవలసి వస్తుంది. మన దేశంలో కుటుంబల పొదుపు వంకరటింకరగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా బ్యాంకులో డబ్బు దాచుకునే విషయంలో మదుపుదార్లు ఇలాంటి ప్రవర్తన కనబరుస్తున్నారు. ఎందుకంటే తాము డిపాజిట్ చేసిన సొమ్ముకు భద్రత ఉండాలని అనుకుంటారు.
మీడియాలో వచ్చిన వార్తలనుబట్టి చూస్తే 2017నాటి ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు పేరు ఫైనాన్షియల్ సెక్టర్ డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ (రెజల్యూషన్) బిల్లు, 2019 అని మార్చాలనుకుంటున్నారు. దీనికోసం మూడు చర్యలు ఆలోచిస్తున్నారు. మొదటిది ఆర్థిక సంస్థల్లో మదుపు పెట్టే వారికి బీమా సొమ్ము పెంచడం. రెండవది బిల్లులో ఆర్థిక సంస్థలను ఆదుకునే విషయంలో ఉన్న గట్టెక్కించే నిబంధనను పరిష్కరించడం. మూడవది పరిష్కార మార్గం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా వర్తింపచేయాలో వద్దో పరిశీలించడం. బ్యాంకులకు పారు బాకీలు పేరుకుపోయి ఇబ్బందుల్లో పడుతున్నాయి కనక మదుపు దార్లకు బీమా మొత్తం పెంచడం ఆహ్వానించదగిన పరిణామమే. దానివల్ల బ్యాంకుల మీద, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఈ బీమా మొత్తాన్ని అందరికీ వర్తింప చేయాలా వద్దా అన్న విషయాన్ని పక్కన పెడితే సవరణలు తీసుకొచ్చేటప్పుడు వ్యవస్థల సుస్థిరత గురించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
ఆర్థిక సుస్థిరతకు సంబంధించి బ్యాంకుల "యాజమాన్యం గురించి చాలా చర్చే జరిగింది. బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉంటే ఆర్థిక సుస్థిరత ఉంటుందని రిజర్వూ బ్యాంకు వాదిస్తుండగా దీనివల్ల ఆర్థిక రంగంలో పోటీకి సంబంధించిన తటస్థ వైఖరికి విఘాతం కలుగుతోందని వాదించే వారూ ఉన్నారు. ఆర్థిక సంస్థల వివాద పరిష్కారానికి సంబంధించిన స్మృతి ప్రధానంగా ఈ వాదన చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేటు రంగ సంస్థలకు సమానమైన అవకాశాలకు విఘాతం కలుగుతోందన్న వాదనా ఉంది.
ఈ నేపథ్యంలో 2017 నాటి ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు దేశంలోని విభిన్నమైన ఆర్థిక సంస్థలకోసం దాదాపు 20 చట్టాలను మార్చాలని అనుకున్నారు. రిజర్వూ బ్యాంకు నించి బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలకు వర్తించే చట్టాలు సవరించాలన్న ప్రతిపాదన ఉంది. బీమా సంస్థలకోసం బీమా నియంత్రణ, అభివృద్ధి వ్యవస్థలోనూ, సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డులోనూ మ్యూచువల్ ఫండ్ల కోసం మార్పులు తీసుకురావాలనుకున్నారు. పింఛన్ ఫండ్ల వ్యవహారంలోనూ మార్పులు అవసరం అనుకున్నారు. విఫలమైన ఆర్థిక సంస్థల వివాద పరిష్కారానికి ఆన్నింటికీ కలిపి ఒకే వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లును పునరుద్ధరించడం మాట ఎలా ఉన్నా వివాద పరిష్కారాలకోసం సకల వ్యవహారాలనూ ఒకే ఛత్రం కిందకు తెచ్చే వ్యవస్థ ఆర్థిక సుస్థిరతకు దారి తీస్తుందా అన్నదే అసలు ప్రశ్న.
ఈ సందర్భంగా అనేక మౌలిక సమస్యలు చర్చకు వస్తాయి. మొదటిది పనిగట్టుకుని ఆర్థిక సంస్థల "తటస్థత" కోసం చేసె ప్రయత్నం ఫలించి ప్రభుత్వ అధీనంలోని, ప్రైవేటు రంగంలో ఉన్న సంస్థల మధ్య నిజమైన పోటీకి అవకాశం ఉంటుదా అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ సంస్థలన్నీ ఒకే సూత్రం ప్రకారం పని చేయవు. ప్రైవేటు ఆర్థిక సంస్థలు ప్రధానంగా లాభాపేక్ష దృష్టితో పని చేస్తాయి. ప్రభుత్వ సంస్థలకు అనేక సామాజిక బాధ్యతలు ఉంటాయి. అవి అందరికీ వర్తించేవిగా ఉండాలి. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యం ప్రభుత్వం చేతిలో ఉంటే వాటిల్లో డబ్బు దాచుకునే వారికి భరోసా ఉంటుంది. అలా కాకుండా పరిష్కరించే అధికారాన్ని ప్రభుత్వ పరిధిలో లేకుండా చేసి ఆ బాధ్యతను ఏదో కార్పొరేషన్ కు అప్పగిస్తే ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరమయ్యే అవకాశమే ఎక్కువ.
అన్నింటికంటే గట్టెక్కించే నిబంధన మరింత వివాదాస్పదమైంది. బీమా మొత్తం వర్తించని డిపాజిట్ల కు బీమా సదుపాయం ఇవ్వాలన్న గట్టెక్కించే నిబంధన బీమా వర్తించని మొత్తాలకు కూడా వర్తింప చేయవలసిన అగత్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం లక్ష రూపాయల మేరకే బీమా వర్తిస్తుంది. ఈ ప్రతిపాదనలు, ఈ బిల్లు పునరుద్ధరణ అన్న అంశాలు 2017నాటి ఆర్థిక సుస్థిరత నివేదికలో డిపాజిట్లు 3.3% తగ్గుతున్నాయని చెప్పినందువల్లే తెరమీదకు వచ్చాయి.
ఇవన్నీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఆర్థిక సుస్థిరత తగ్గుతున్నందువల్ల ప్రజల విశ్వాసాన్ని చెదరగొట్టే చర్యలకు ప్రభుత్వం ఎందుకు పూనుకుంటున్నట్టు? వ్యవస్థాపరమైన సుస్థిరతకు దోహదం చేసే అంశాన్ని ఈ ప్రతిపాదనలు మరింత బలహీన పరుస్తాయి. ఈ దృష్టితో చూస్తే ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లును పునరుద్ధరించడంవల్ల ప్రయోజనం ఉంటుందని ఎలా నమ్మగలం?