దర్యాప్తులో కనిపించని నిష్పాక్షికత
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
వ్యక్తి శ్రేయోవాదం అన్న ఉదారవాద విధానాలను, వ్యక్తి స్వేచ్ఛను కాపాడడానికి కొన్ని హక్కులు ఉండాలన్న సూత్రాన్ని అనుసరించే ఏ సమాజమైనా నిర్దిష్ట ప్రక్రియలను అనుసరించడం అత్యంత ప్రధానం. నిర్దిష్ట ప్రక్రియలు అంటే దర్యాప్తు చేసే పోలీసులు, నేర నిర్ధారణలో కీలక పాత్ర పోషించే న్యాయ సంబంధ వైద్య (ఫోరెన్సిక్) నిపుణులు దాపరికం లేకుండా వ్యవహరించాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనుమాన రహితంగా సాక్ష్యాధారాలను వెలికి తీయడానికి పోలీసులు, న్యాయ సంబంధ వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని వినియోగించవలసి ఉంటుంది. దండ నీతి వ్యవస్థలో పని చేసే వారు వ్యక్తికి న్యాయం కలిగే రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే "న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్టు కనిపించాలి" అన్న నానుడి వచ్చింది.
నేర విచారణా ప్రక్రియలను ఎంత బాగా అమలు చేస్తారన్న అంశంపైనే న్యాయం ఆధారపడి ఉంటుంది. దండనీతి వ్యవస్థలో నిష్పాక్షికత, శాస్త్రీయమైన నిరపేక్ష పద్ధతి మొదలైన వాటిని న్యాయ సంబంధ వైద్య నిపుణులు అనుసరించాలి. అప్పుడే దర్యాప్తు కూడా పక్షపాత రహితంగా ఉంటుంది. దర్యాప్తు సంస్థలు సమగ్రమైన సాక్ష్యాధారాలు సేకరించాలి. అవి తిమ్మిని బమ్మి చేయడానికి, నీరుగార్చడానికి అనువుగా ఉండకూడదు. అంటే దర్యాప్తు సంస్థలు సాక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయనో, లేదా సాక్ష్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాయనో ఆరోపణలకు అతీతంగా ఉండాలి.